లూకా
లూకా రాసిన సువార్త
గ్రంథకర్త
దీని రచయిత లూకా అని సమకాలీన రచయితలు అందరూ అభిప్రాయపడ్డారు. లూకా సువార్త శైలిని బట్టి ఇతడు వైద్యుడని, రెండవ తరం క్రైస్తవుడని అర్థం అవుతున్నది. సాంప్రదాయికంగా ఇతడు యూదేతరుడని అందరి అభిప్రాయం. ఇతడు ముఖ్యంగా సువార్తికుడు. పౌలుతో కలసి మిషనెరీ ప్రయాణాల్లో పాల్గొన్నాడు (కొలోస్సి 4:14; 2 తిమోతి 4:11; ఫిలేమోను 24).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 58 - 61
లూకా తన రచన కైసరయలో ఆరంభించి రోమ్ లో ముగించాడు. ముఖ్యంగా బేత్లేహేము, గలిలయ, యూదయ, యెరూషలేముల్లో గ్రంథ రచన జరిగింది.
స్వీకర్త
లూకా ఈ గ్రంథాన్ని తియోఫిలాకు అంకితం చేశాడు. ఈ పేరుకు అర్థం “దేవుణ్ణి ప్రేమించేవాడు.” ఈ వ్యక్తి అప్పటికే క్రైస్తవుడో లేక క్రైస్తవుడిగా మారడానికి అలోచిస్తున్నాడో తెలియదు. లూకా ఇతన్ని “ఘనుడైన” అని సంబోధించడం వల్ల (1:3) ఇతడొక రోమా అధికారి అని అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకంలో అనేక సాక్షాధారాలు యూదేతరుల కోసం లూకా రాశాడని సూచిస్తున్నాయి. లూకా ముఖ్యంగా “మనుష్య కుమారుడు,” “దేవుని రాజ్యం” (5:24; 19:10; 17:20, 21; 13:18) వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరించాడు.
ప్రయోజనం
యేసు జీవిత చరిత్ర కథనం ఆయన్ను మనుష్య కుమారునిగా చూపెడుతున్నది. తియోఫిలాకు బోధించిన విషయాల గురించి అతనికి తేటతెల్లమైన అవగాహన కలగడం కోసం (1:4) లూకా ఈ పుస్తకం రాశాడు. క్రైస్తవులు హింస ఎదుర్కొంటున్న సమయంలో యేసును అనుసరించే వారిలో ఎలాటి హీనత, నిగూఢత లేదని సమర్థించడానికి లూకా రాశాడు.
ముఖ్యాంశం
యేసు, పరిపూర్ణ మానవుడు.
విభాగాలు
1. యేసు పుట్టుక, బాల్యం — 1:5-2:52
2. యేసు పరిచర్య ఆరంభం — 3:1 – 4:13
3. యేసు రక్షణకర్త — 4:14-9:50
4. యేసు సిలువ దిశగా పయనం — 9:51-19:27
5. యేసు యెరూషలేము జయప్రవేశం, సిలువ, పునరుత్థానం — 19:28-24:53