1 తెస్సలోనిక పత్రిక
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయితగా పౌలు రెండు సార్లు తనను చెప్పుకున్నాడు (1:1-2:18). పౌలు రెండవ సువార్త యాత్రలో ఈ సంఘం ఏర్పడినప్పుడు (అపో. కా. 17:1-9) అతనితో కలిసి ప్రయాణించిన సీల, తిమోతి (3:2, 6) కూడా ఈ పత్రిక రాయడంలో ఉన్నారు. అక్కడినుంచి వెళ్ళిపోయిన కొద్ది నెలలకే పౌలు తన మొదటి పత్రిక రాశాడు. ఇక్కడ పౌలు పరిచర్య కేవలం యూదులకే గాక యూదేతరులకు కూడా వ్యాపించింది. సంఘంలో అనేకమంది యూదేతరులు విగ్రహ పూజను వదిలిపెట్టారు. ఇది ఆనాటి యూదులకు పెద్ద సమస్య కాదు (1:9).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 50 - 52
కొరింతి పట్టణంలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు.
స్వీకర్త
1:1 పకారం తెస్సలోనిక సంఘ సభుల కోసం పౌలు ఇది రాశాడు. అయినప్పటికీ అంతటా ఉన్న క్రైస్తవులందరికీ ఇది ఉపయుక్తం.
ప్రయోజనం
నూతన విశ్వాసులు తమ బాధల్లో ప్రోత్సాహం పొందడం పౌలు ఉద్దేశం (3:3-5). భక్తి జీవితానికి అవసరమైన సూచనలు ఇందులో ఉన్నాయి (4:1-12). అంతేకాదు, క్రీస్తు రాకకు ముందే చనిపోయిన వారి భవితవ్యం గురించిన నిశ్చయత ఇవ్వడం కూడా (4:13-18). ఇంకా కొన్ని నైతిక ఆచరణాత్మక అంశాల గురించిన వివరణ పౌలు ఇచ్చాడు.
ముఖ్యాంశం
సంఘం గురించిన శ్రద్ధ.
విభాగాలు
1. కృతజ్ఞతలు — 1:1-10
2. అపోస్తలిక చర్యల గురించి సంజాయిషీ — 2:1-3:13
3. తెస్సలోనికయులకు హెచ్చరికలు — 4:1-5:22
4. ముగింపు ప్రార్థన, ఆశీర్వచనం — 5:23-28